హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా

  • తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినందుకు చర్య
  • బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఘటన
  • తాగునీటితో దుకాణ ప్రాంగణాన్ని కడిగిన వ్యక్తికి జరిమానా
హైదరాబాద్‌లో మంచినీటిని వృథా చేసినందుకు జలమండలి ఒక వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించింది. తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించినందుకు గాను అధికారులు ఈ చర్య తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఆరెంజ్ ట్రీ ఫర్నీచర్ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. తాగునీటితో ఒక వ్యక్తి దుకాణ ప్రాంగణాన్ని కడిగాడు. తనిఖీల సందర్భంగా జలమండలి అధికారులు దీనిని గుర్తించారు.

స్వయంగా రంగంలోకి దిగిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంచినీటిని వృథా చేస్తున్న వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే రూ.10 వేల జరిమానా విధించారు. ఈ క్రమంలో నగర ప్రజలకు జలమండలి అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

తాగునీటిని కేవలం తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రోడ్లు, ఇళ్ళు, వాహనాలు కడగడానికి ఉపయోగించకూడదని అన్నారు. నీటి వృథాను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని జలమండలి హెచ్చరించింది.


Hyderabad Metro Water Works
Water wastage
Hyderabad
Jalamandali
Ashok Reddy
Banjara Hills

More Telugu News